గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Wednesday, December 28, 2022

కళా విహీనుడు అవసరమా?....కనకదుర్గ దంటు ..89772 43484 || నమస్తే తెలంగాణ

నమస్తే తెలంగాణ కళా విహీనుడు అవసరమా?
....కనకదుర్గ దంటు ..89772 43484 
పకోడీలు చేసేవాడు పకోడీలే చేయగలడు, పులిహోర చేయలేడు. అలాగే మోసపూరిత రాజకీయాలతో, వంచనతో అధికారంలోకి వచ్చినవాడు ఆ రకమైన పద్ధతులకే అలవాటు పడతాడు గానీ నిఖార్సైన పద్ధతులు పాటించలేడు. ప్రగతి పథంలో దూసుకుపోతూ, అవార్డులు గెలుచుకుంటూ, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ మోసపూరిత రాజకీయాలన్న చర్చ ఎందుకు రావాలి? ఎందుకంటే, నాలుగేండ్ల కిందట బద్ధ శత్రువులన్న పార్టీలన్నింటితో కలిసి మహా కూటమిగా ఏర్పడి, ఎన్నికల్లో పోటీ చేసి, మహా దెబ్బ తిన్న పచ్చ తేళ్ళు మళ్లీ తమ మోసపూరిత రాజకీయాలు మొదలుపెట్టాయి. ‘ఆంధ్రా విడిపోతే చాలా మంది వెళ్ళిపోతారు కదా సార్ ?' అంటే జయశంకర్ సార్ నవ్వారు. 'ఎవ్వరూ వెళ్ళిపోరు. హైదరాబాద్ వదలి ఎందుకు వెళతారు? మధ్య తరగతి ఉద్యోగులు కూడా ఇళ్ళు కట్టుకుని స్థిరపడ్డారు. ఇక వ్యాపారులు అసలు వెళ్ళరు. ఆంధ్రా రాజకీయ నాయకుల ఆస్తులే కాకుండా కబ్జా చేసిన ప్రాంతాలన్నీ హైదరాబాద్ లోనే కదా! వాళ్లెందుకు వెళతారు?' అన్నారు. కేవలం తొమ్మిది ఏండ్లలోనే హైదరాబాద్ మహా నగరాన్ని నిర్మించి, ఈ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేసి, నాలుగు కోట్ల ప్రజలను ఉద్దరించి, కేవలం రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. ఒక మహా నేతకు! ఇక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆ నేత అక్కడ మాత్రం ఊరికే ఉంటాడా? ఒక మహోన్నత రాజధానిని కేవలం అయిదు ఏండ్లలోనే నిర్మించి, వారిని ఉద్ధరించి, మళ్ళీ ఈ ప్రాంతం వెనకబడిందనే ఆవేదనతో తెలంగాణలో తన రాజకీయం (మాటిమాటికీ మోసపూరిత అంటే బాగుండదు) మొదలుపెట్టారు చంద్రబాబు. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించినా, ప్రజాహిత కార్యక్రమాలేవీ చెయ్యకపోవడంతో ఆయనను ఛీ కొట్టారు. ఆంధ్రా ప్రజలు. నిజానికి ఆ అయిదేళ్ళు కూడా వర్క్ ఫ్రంహోం లాగా తాను హైదరాబాద్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేయడంతో ఆ ప్రజలు విసిగిపోయారు. కానీ అంతటి ప్రతిభావంతుడు మన నగరంలో ఉంటే హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతుంది కదా! ఆంధ్రాలో సింగపూర్, జపాన్ ను తలదన్నే అమరావతిని నిర్మించిన చంద్రబాబు, ఇక్కడ కూడా 2014 నుండి బాగా వెనకబడ్డ హైదరాబాద్ నగరాన్ని ఉద్దరిస్తానంటే సంతోషమే కదా! కేసీఆర్ నిరాహార దీక్ష కారణంగా 2009లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడి మళ్ళీ 14 రోజుల తర్వాత డిసెంబర్ 23న ఆ మాట కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకునే దాకా జయశంకర్ సార్ తో చేసిన కొన్ని చర్చలు, వారి మాటలు దాదాపు 13 ఏండ్ల తర్వాత గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది. 'ఆంధ్రా విడిపోతే చాలా మంది వెళ్ళిపోతారు కదాసార్ ?' అంటే జయశంకర్ సార్ నవ్వారు. 'ఎవ్వరూ వెళ్ళిపోరు. హైదరాబాద్ వదలి ఎందుకు వెళతారు? మధ్య తరగతి ఉద్యోగులు కూడా ఇళ్ళు కట్టుకుని స్థిరపడ్డారు. ఇక వ్యాపారులు అసలు వెళ్ళరు. ఆంధ్రా రాజకీయ నాయకుల ఆస్తులే కాకుండా కబ్జా చేసిన ప్రాంతాలన్నీ హైదరాబాద్లోనే కదా! వాళ్లెందుకు వెళతారు?' అన్నారు. చాలాసార్లు జయశంకర్ సార్ ఇలా అనేవారు. 'ఆంధ్రా వారు తెలంగాణలో ఉన్నందు వల్ల నష్టం లేదు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారు తమ కుయుక్తులను పన్నుతూనే ఉంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా నిలువ లేదని, ఇక్కడ వనరులను ఉపయోగించుకొనే శక్తి, పరిపాలన చేసుకొనే సామర్థ్యం, తెలివి తెలంగాణ వారికి లేవని అంటారు. అంతేకాదు, ఒక వేళ రాష్ట్రం సిద్ధించి, కేసీఆర్ వంటి నాయకుడు పాలిస్తున్నా, కాళ్లలో కట్టెలు పెడతారు. వీరి పాలనలో జరిగినట్టే, తెలంగాణ వనరులను కేంద్ర ప్రభుత్వ సహాయంతో తరలించుకు పోవడానికి ఎత్తులు వేస్తారు. పరిపాలన సాగకుండా, ప్రజలకు విరక్తి రావాలని అడ్డం పడతారు. వారు బ్రిటీష్ పాలనలో ఆ కుట్రలన్నీ నేర్చుకున్న వాళ్లు కదా! స్థానికులకు పరిపాలన సాగించే సామర్థ్యం లేదని నిరూపించడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తారు. చివరకు మళ్లీ రెండు ప్రాంతాలు ఒక్క రాష్ట్రమైతేనే తెలంగాణకు మంచిదని చెప్పడానికి, దాన్ని సాధించడానికి కూడా వెనకాడరు. ' ఎంత నిజం! ఆంధ్రా రాజకీయ నాయకులను సార్ ఎంత బాగా అర్థం చేసుకున్నారని అనిపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తెల్లారే 7 మండలాలను కలుపుకుని, డిస్కంలన్నీ ఆంధ్రాలో పెట్టుకుని, కరెంట్ ఇవ్వకుండా ఎంత ద్రోహ బుద్ధి ప్రదర్శించారు చంద్రబాబు నాయుడు! ఈ రోజు హైదరాబాద్ లోని నిజాంపాలెస్ కూడా తానే కట్టానని మాట్లాడతారాయన. మరి 2014 జూన్ తర్వాత కేసీఆర్ చేపట్టి పూర్తి చేసిన పథకాలు తనే రచించానని చెప్తారేమో ఎన్నికల వేళ! తెలంగాణకు, మహారాష్ట్రకు మధ్య ఎన్నో చిక్కుముడులు వేసి బాబ్లీ ప్రాజెక్ట్ ఒక అంగుళం ముందుకు జరగకుండా చేసిన ఘనత చంద్రబాబుదే కదా ! మరి రాష్ట్రం ఏర్పడ్డాక అంత త్వరగా, సామరస్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఆ ముడులు విప్పి ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని మూడున్నర ఏండ్లలో ఎలా పూర్తిచేశారు? చంద్రబాబు తన తెలివిని కుట్రలకు ఉపయోగిస్తే, కేసీఆర్ రాష్ట్ర ప్రగతికి తన మేధని ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరిత హారం, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కంటిపరీక్షలు, కంటి చికిత్సలు, ఉచిత కరెంట్, చేపల గొర్రెలపంపిణీ, సంచార పశు వైద్యశాలలు, గోదాములు, కల్లాలనిర్మాణం - ఒకటేమిటి, సబ్బండ వర్గాల అవసరాలు గమనించి, పథకాలు రచించి అమలు చేస్తున్నారు. గర్భస్థ శిశువుల ఆరోగ్యం కోసం గర్భిణులకు పోషకాహారం అందించడం దగ్గర నుంచి, ముసలివాళ్లకు ఆసరా పింఛన్ల వరకు అందరినీ ఆదుకుంటున్నాయి కేసీఆర్ మేధ, మానవత్వం నుండి ఉద్భవించిన పథకాలు. చివరకు చనిపోయినవారిని గౌరవంగా సాగనంపడానికి వైకుంఠ ధామాలు అన్నిహంగులతో నిర్మించడం ఎంత ఉదాత్తమైన ఆలోచన! చంద్రుడు కళలు పెరుగుతూ, క్షీణిస్తూ ఉండే ఒక గ్రహం. చంద్ర శేఖరుడు అంటే శివుడు. ఇద్దరూ ఒకటి కాదు, కాలేరు. గ్రహించండి. భగవంతుడు నాలుక ఇచ్చాడు కదా అని పదే పదే అబద్ధాలు చెబితే లాభం లేదు. అదే భగవంతుడు ప్రజలకు బుద్ధి, ఆలోచనా శక్తి కూడా ఇచ్చాడు. పైగా తెలంగాణ ప్రజలకు పోరాట స్పూర్తి, మంచీ చెడూ విచక్షణ కూడా ఉంది. ఇచ్చకాలకు లొంగిపోరు. ప్రగతి శీల పాలన, మోసపూరిత రాజకీయాల మధ్య వ్యత్యాసం ఎంత ఉందో కాళేశ్వరం, అమరావతిని చూసి తెలుసుకోగలరు. జై తెలంగాణ

Tuesday, December 27, 2022

NEWS VIDEO CLIP NAMASTHE TELANGANA 28 DEC 2022

భజన ఉద్యమం - శతకోటి హరేరామ నామ యజ్ఞం || అప్పాల రసరాజు, పాండురంగ ఆశ్రమ నిర్వాహకులు, 96764 54189


భజన ఉద్యమం - శతకోటి హరేరామ నామ యజ్ఞం 
పుణ్యం పొందే మార్గాలు ఎన్నో! కృత యుగంలో తపస్సు.. త్రేతా యుగంలో యజ్ఞం..ద్వాపరంలో ధర్మాచరణం.. మరి కలియుగంలో ...? స్మరణం.. సంకీర్తనం..నామ భజన ! భక్తి ఉద్యమ సారథులు ఎందరో ఆచరించిన మార్గం ఇది. అదే ఆధ్యాత్మికబాటలో మొదలైనదే భజన ఉద్యమం. శతకోటి హరేరామ నామ జప యజ్ఞంగా పల్లెపల్లెకూ విస్తరిస్తున్నది. 'నగర సంకీర్తన'గా పల్లవిస్తున్నది. రామనామ భజనలో ప్రతి ఊరునూ ఓలలాడిస్తున్నది.
అనగనగా ఓ పల్లె.. తొలి ఏకాదశి.. తొలిపొద్దు పొడవలేదింకా! ఆషాఢ మేఘాలు చిరుజల్లులు కురిపిస్తున్నాయి. రామాలయం సన్నిధికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. తాళాలు సరిచూసుకుంటున్నారు కొందరు. తప్పెట్లు లయ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంకొందరు. పది నిమిషాలకు భక్తజనమంతా గుమిగూడారు. భక్తిభావంతో ముందుకు కదిలారు. అందరి నోటా ఒకటే మాట..
'హరేరామ హరేరామ రామరామ హరేహరే| హరే
కృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే||' 
ముప్పయి రెండు అక్షరాల మోక్ష మంత్రం ఇది. వారిది పైపై పెదాల కదలిక కాదు! హృదయాంతరాల్లోంచి పెల్లుబికిన మహా మంత్రం! సామూహిక భజన!! తాళానికి తగ్గట్టుగా భజన. భజనకు తగ్గట్టుగా తాళం. అది భక్తి రాగం, 
దైవ తాళం. గమకాల గమనాలు తెలియకున్నా.. రుద్ర నమకమంత కమ్మగా సాగే భజన. రామపరివారం తమ వెనకాలే కదులుతుందన్న అనుభూతికి లోనవుతూ తన్మయులై చేసే భజన! ఊరంతా కలియ తిరుగుతూ 
'కలౌ తు నామ మాత్రేణ పూజయేత్ భగవాన్ హరిః' సూత్రాన్ని నిజం చేస్తూ సాగిపోయే భజన. సిద్దిపేట
జిల్లా జగదేవప్పూర్ గ్రామం నుంచి మొదలైన 'నగర సంకీర్తనం' ప్రస్తుతం చేర్యాల, మునిగడప, మర్కూకు, ఎర్రవల్లి, రాజపేట, ప్రజ్ఞాపూర్, దామరకుంట, యాదగిరిగుట్ట, చుంచనకోట, బైరాన్పల్లి ఇలా నలభై గ్రామాల్లో కొనసాగుతున్నది. ఈ ఆధ్యాత్మిక భజన యాత్రను 108 గ్రామాలకు విస్తరించే యోచనలో ఉన్నారు నిర్వాహకులు.
ఎందుకీ భజన? లోక రక్షకుడైన రాముడి అనుగ్రహం కోసం. భద్రగిరి రామయ్య మనల్ని భద్రంగా చూడాలనే సంకల్పంతో మొదలుపెట్టిన పుణ్యక్రతువు ఇది. సిద్దిపేట జిల్లా మర్కూకు మండలంలో ఉన్న పాండురంగ ఆశ్రమం వ్యవస్థాపకులు యతివర భావానంద భారతీ స్వామి దివ్య సంకల్పమే ఈ భక్తి ఉద్యమం. వందేండ్లకు పూర్వమే
తెలంగాణలో 'రామ నామ' సంకీర్తనకు విశేషప్రచారం కల్పించిన మహనీయుడు ఆయన. వారి పూర్వాశ్రమ కుమారుడు మహాత్మ అప్పాల విశ్వనాథ శర్మ 'భగవత్ సేవా సమాజం' అనే సంస్థను స్థాపించి భగవన్నామ ప్రచారం నిర్వహించారు. వారి అడుగుజాడల్లో ఈ భక్తి ఉద్యమం మళ్లీ పురుడు పోసుకున్నది. లోక కల్యాణార్థం చేపట్టిన
‘శతకోటి హరేరామ నామ జప యజ్ఞం'లో అశేషసంఖ్యలో భక్తులు భాగమవుతున్నారు. ఊరూరూ దాటుకుంటూ, వాడవాడలో ఆగుకుంటూ, మనిషి మనిషినీ కలుపుకొంటూ.. గొంతులన్నీ ఒక్కటై 
'తక్కువేమి మనకురాముండొక్కడుండు వరకు' అని ధీమాగా పాడుకుంటూ హరి నామ స్మరణలో
ఓలలాడుతున్నారు.
పక్షం రోజులకు ప్రతి ఏకాదశికీ 'నగర సంకీర్తనం'. దీనికి తోడుగా నిత్యం రామనామ జపం. ఎక్కడి వారు అక్కడే, ఎప్పుడంటే అప్పుడే.. పవిత్రమైన మనసుతో 'హరేరామ.. హరేహరే’ మంత్రాన్ని పఠించడమే! సాయంత్రానికి జప
సంఖ్య వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తారు. ఇప్పటి వరకు జప సంఖ్య 30 కోట్లు పూర్తయింది. రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటం, భగవత్ అనుగ్రహంతో వచ్చే ఏడాది పూర్తయ్యేనాటికి శతకోటి నామ స్మరణ పూర్తవుతుందని పాండురంగ ఆశ్రమ నిర్వాహకులు పేర్కొంటున్నారు. 2024 పుష్యమాసంలో ఏడు రోజులపాటు జప హోమం, 
పూర్ణాహుతి నిర్వహించాలని సంకల్పించారు. ఈ భజన ఉద్యమంలో అందరూ భాగస్వాములే. రమ్యమైన రామనామాన్ని మనసారా ఆలపిద్దాం. కష్టాలు తీర్చే కృష్ణ మంత్రాన్ని కమనీయంగా పలుకుదాం!
హరేరామ హరేరామ రామరామ హరేహరే ||
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే||
... కణ్వస
• అందరి సహకారం
రాముడి కార్యం ఏదైనా ఘనంగానే జరుగుతుంది. 'నగర సంకీర్తనం' కూడా ఇందుకు మినహాయింపు కాదు! 
జగదేవ్పూర్ నుంచి ప్రారంభమైన ఈ భక్తిఉద్యమం ఊరూరా విస్తరిస్తున్నది. వందలాది మంది పరోక్షంగా నిత్యం 16 జపమాలల  హరేరామ నామస్మరణ చేస్తుండటం విశేషం. గ్రామవాసులు ఎందరో ఈ క్రతువుకు ఇతోధికంగా అండగా
నిలుస్తున్నారు. పాండురంగ ఆశ్రమం నిర్వహిస్తున్న ఈ క్రతువులో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నా.
• ఆదరాసుపల్లి శ్రీధర్, జగదేవ్ పూర్
• నాదం - సాదం
దైవనామాన్ని సంకీర్తన చేసిన క్షణం నుంచే దైవానికి మరింత చేరువ
అవుతాం. భజనలో తెలియకుండానే ప్రయత్నం లేకుండానే మనసు భగవం
తుడి వశం అవుతుంది. గంటల తరబడి చేసే సాధనలో మనసును నిలుపు
చేయడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకే పాండురంగ ఆశ్రమ
వ్యవస్థాపకులు యతివర భావానంద భారతీ స్వామివారు భజన మార్గాన్ని
ఉపదేశించారు. వారి తర్వాత ఆశ్రమ నిర్వాహకులు విశ్వనాథ శర్మ దానిని
కొనసాగించారు. ఆయన వారసులుగా ఈ భజన ఉద్యమానికి శ్రీకారం
చుట్టాం. 'నాదం- సాదం' నినాదంతో ముందుకుసాగుతున్నాం.
అప్పాల రసరాజు, పాండురంగ ఆశ్రమ నిర్వాహకులు, 96764 54189